త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లపై తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ప్రధానంగా ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. అధికారపార్టీ టీడీపీ కంటె వైసీపీనే ముందు తమ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్తిని ప్రకటించింది.
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిలబెడుతున్నామని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తమ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉందని, తమ అభ్యర్థి గెలవడం ఖాయమని చెప్పారు. అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎంపీ టీజీ వెంటకటేష్ ప్రయత్నాలు జరుపుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు తమ ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువని… ఆయన ఆ స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. హవాలా ద్వారా డబ్బులు చేకూర్చే పనిలో యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యం రాజ్యసభ ఎన్నికలు అయిపోయోంతవరకు పార్టీ ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటారనేదానిమీదనే తమ పార్టీ గెలుపు అధారపడి ఉంటుంది.