డిప్యూటీ సీఎంగా పిఠాపురంకు పవన్‌

ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి పిఠాపురంకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి పవన్‌ గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రెండుసార్లు పిఠాపురంకు వెళ్తున్నట్లు షెడ్యూల్ ప్రకటించిన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

ఇక ఈ నెల 25న పవన్ పిఠాపురంకు వస్తున్నారని వెళ్లడించినా వారాహి దీక్ష నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా జూలై 1 నుండి మూడు రోజుల పాటు పిఠాపురంలో పర్యటిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి.

పిఠాపురం నుండి 70 వేల మెజారిటీతో విజ‌యం సాధించారు పవన్‌. పిఠాపురం పర్యటన సందర్భంగా ప్రజలనుద్దేశించి భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్ర‌జ‌ల నుంచి వారి వ్య‌క్తిగ‌త‌, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పైనా ద‌ర‌ఖాస్తులు తీసుకుంటారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించనున్నారు పవన్‌. అలాగే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం నిర్వ‌హించనున్నారు పవన్.