హైదరాబాద్లోని మొయినాబాద్లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులను తెలంగాణ పోలీస్కు చెందిన ఈగల్ (EAGLE) టీమ్ చేపట్టింది.
పోలీసులు ఫామ్ హౌస్పై దాడి చేసిన సమయంలో అక్కడ పార్టీ జరుగుతుండగా మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారని సమాచారం వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. డ్రగ్స్ వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు అందరిని విచారిస్తున్నారు.
దాడి సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల దాడిని అడ్డుకునేందుకు నమిద్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులను భయపెట్టేందుకు నాలుగు రౌండ్ల గన్ ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
దాడిలో ఉపయోగించిన తుపాకీ రితేష్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. రితేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు అని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ మూలాలు, పార్టీలో పాల్గొన్న వ్యక్తుల వివరాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
