గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త, ప్రముఖ ‘భ్రమర రియల్ ఎస్టేట్’ అధినేత గల్లా రామచంద్రరావుపై గుంటూరు జిల్లా కలెక్టర్తో పాటు వినుకొండ ఎమ్మెల్యేకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్లాట్లు విక్రయించే సమయంలో మాయమాటలు చెప్పి తమను దారుణంగా వంచించారని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులు గుంటూరు కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో అధికారికంగా ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వినుకొండలోని భ్రమర రియల్ ఎస్టేట్ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో గల్లా రామచంద్రరావు తమకు ఎన్నో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి ప్లాట్లు కొని తీవ్రంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, సదరు వెంచర్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు.వెంచర్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్ లైన్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.ఇప్పటికే ఈ సమస్యపై వినుకొండ ఎమ్మెల్యేతో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు కూడా వినతిపత్రాలు సమర్పించామని, అయినా ఇంతవరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని బాధితులు పేర్కొన్నారు.
దీంతో మరోసారి స్పందన/గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు మరియు వినుకొండ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు తక్షణమే న్యాయం చేయాలని, లేనిపక్షంలో బాధితులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
