గత కొన్ని రోజులుగా టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ పశ్చిమ ఢిల్లీ నుంచి భాజాపా తరుపున బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గంభీర్ తన రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు.
ఇటీవలే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన గంభీర్ ట్విట్టర్ ద్వారా ఊహాగానాలకు తెరదించాడు. తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని స్పష్టం చేశాడు. ఆ ఊహాజనిత వార్తల్లో వాస్తవం లేదని కొట్టి పడేశాడు. ప్రస్తుతానికి తాను రిటైర్డ్ క్రికెటర్ను మాత్రమేనని పేర్కొన్నాడు.
గంభీర్ బీజేపీలో చేరబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గంభీర్ పోటీ చేయబోతున్నాడంటూ పుకార్లు షికారు చేశాయి. భాజాపాతో గంభీర్ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, గంభీర్ తాజా ట్వీట్తో ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడింది.
