వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తి దాడికేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వలు జారీ చేసింది. అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కత్తితో జగన్పై దాడికి పాల్పడ్డాడు.
తనకు సిట్పై నమ్మకం లేదని కేసును NIAకి అప్పగించాలని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. దర్యాప్తు ఆలస్యమైతే సాక్షాలు తారామారవుతాయని పిటిషన్ వాదించారు. పిటిషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించింది.
అక్టోబరు 25న విశాఖ ఎయిర్ పోర్ట్ లాంజ్లో హైదరాబాద్ వెల్లడానికి ఎదురుచూస్తున్న సమయంలో జగన్పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశారు. సెల్ఫీ దిగేందుకు దగ్గరకొచ్చిన శ్రీనివాస్.. కోడి పందేలు వాడే కత్తితో జగన్పై దాడికి తెగబడిన సంగతి తెలిసిందే.
జగన్పై దాడి ఘటన గత ఏడాది ఏపీ రాజకీయాలను కుదిపేసింది. వైసీపీ, టీడీపీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. జగన్ను చంపేదానికే టీడీపీ నేతలు కుట్రలు చేశారని వైసీపీ ఆరోపిస్తే….సానుభూతి కోసమే జగన్ దాడి తనపై చేయించుకున్నాడని టీడీపీ తిప్పికొట్టింది.
కేసు విచారణకు వస్తుందన్న రెండు రోజుల ముందు విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్డా కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్ వెనుక మరెవరూ లేరని ఏపీ పోలీసు అధికారి లడ్డా వెల్లడించిన రెండు రోజుల్లోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఈ క్రమంలో కేసు కేంద్రం దర్యాప్తు సంస్థకు బదిలీకావడం కీలక పరిణామంగా చెబుతున్నారు న్యాయ నిపుణులు.