కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్ వ్వవహారం సంచలనం రేపుతోంది. సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అయితే, ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సిద్దార్థ కేఫ్ కాఫీ డే సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించారు. ఆయనకు చిక్మంగళూరులో 12,000 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ ఎస్టేట్ ఉంది. సిద్దార్థ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రచారం సాగడంతో పోలీసులు గాలిస్తున్నారు.
అయితే అతను రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. స్టాక్స్ పున: కొనుగోలు(buy back stocks)కు వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్టు సిద్దార్థ అందులో వెల్లడించాడు. లాభాలు సృష్టించే వ్యాపార నమోనాను తయారు చేయలేకపోయినందుకు చింతిస్తున్నట్లు ఆ లేఖలో అతను భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు. ఎంత కష్టపడినా.. లాభాలు రాలేకపోయాయన్నాడు. నా సాయశక్తులా బిజినెస్ అభివృద్ధి కోసం ప్రయత్నించాను, కానీ నాపై నమ్మకం ఉంచిన వారిని ఆదుకోలేకపోతున్నాను, ఇన్నాళ్లూ ఆ వత్తిడి తీసుకుని పనిచేశా, కానీ ఇప్పుడు ఆ వత్తిడి తట్టుకోలేను, షేర్లను కొనుగోలు చేయాలని ఓ పార్ట్నర్ వత్తిడి తెస్తున్నాడని సిద్దార్థ తన లేఖలో తెలిపాడు.
1993లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన, అనతి కాలంలోనే మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. 1996లో కేఫ్ కాఫీ డేను ప్రారంభించి దేశవ్యాప్తంగా 1550 బ్రాంచీలను ఏర్పాటుచేశారు. ఈవార్తతో కాఫీడే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు 20 శాతం పడిపోయాయి. సోమవారం సాయంత్రం రూ.191.75 దగ్గర కాఫీడే షేర్ ధర ముగిసింది. మంగళవారం ఉదయం 9.19 గంటలకు కాఫీడే షేర్ ధర ఒక్కసారిగా 20% పడిపోయింది. లోయర్ సర్క్యుట్ను తాకి రూ.153.40 దగ్గర కొనసాగుతోంది. గత ఏడాదిలో కాఫీడే షేర్ ధర 27% తగ్గింది. 2018 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 2,016 కోట్లకు పైగా ఉండటం విశేషం.