తమిళ సూపర్స్టార్ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ‘సిగ్మా’ అనే క్రేజీ చిత్రంతో ఆయన టాలీవుడ్, కోలీవుడ్లో డైరెక్టర్గా పరిచయమవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. అయితే, వాస్తవానికి ఈ సినిమా జులై 31నే థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ సంజయ్ తన సినీ ప్రయాణం, డ్రీమ్ ప్రాజెక్ట్ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
తన బాల్యం, సినిమా రంగంపై ఆసక్తి ఎలా కలిందనే దానిపై జాసన్ స్పందిస్తూ.. ‘‘చిన్నప్పటి నుంచి నేను మా నాన్నతో పాటు షూటింగ్ సెట్స్కి వెళ్లేవాడిని. అక్కడ ఉండే వాతావరణం నాకు ఎంతో నచ్చేది. నిజానికి నేను మొదట పైలట్ కావాలనుకున్నా, ఆ తర్వాత కొన్నాళ్లకు క్రికెటర్ కావాలనిపించింది. కానీ, ఇంటర్మీడియట్ చదివే సమయంలో నాకు సినిమాలపై తీవ్రమైన ఆసక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచి అందరికీ కథలు చెప్పడం నాకు చాలా ఇష్టం. అలా నా స్నేహితులకు రకరకాల సంఘటనలను కల్పించి చెప్పేవాడిని. ఆ తర్వాత వాటిని పేపర్ మీద రాసుకోవడం అలవాటైంది. కెనడాలో అధికారికంగా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్చుకున్నాక, నేను జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాననేదానిపై నాకు పూర్తి స్పష్టత వచ్చింది.’’ అని తెలిపారు.
తన భవిష్యత్ లక్ష్యాలపై మాట్లాడూతూ.. తన తండ్రి దళపతి విజయ్ని డైరెక్ట్ చేయాలన్నదే తన జీవితాశయం అని జాసన్ వెల్లడించారు. అంతేకాకుండా, కేవలం విజయ్ మాత్రమే కాకుండా హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్ను కూడా కలిపి ఒకే సినిమాలో డైరెక్ట్ చేయాలనే బలమైన కోరిక ఉందని మనసులో మాట బయటపెట్టారు. ‘‘ఈ కాంబినేషన్ గురించి చెబితే ఆన్లైన్లో నెటిజన్లు మీమ్స్, జోక్స్ వేస్తారని నాకు బాగా తెలుసు. కానీ, డాడీ, జాసన్ స్టాథమ్ కాంబో స్క్రీన్ మీద చూడటానికి చాలా పవర్ఫుల్గా, అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.’’ అని జాసన్ సంజయ్ ఆసక్తికరంగా పేర్కొన్నారు. దళపతి వారసుడిగా డైరెక్టర్ కుర్చీలో కూర్చోబోతున్న జాసన్ సంజయ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి మరి.
