గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలి. ప్రతి పంచాయతీకి నిధుల సమస్య లేకుండా చూస్తున్నాము. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలుపెట్టాలి’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులు పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలి అన్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్యకార్య నిర్వహణ అధికారులు, డిపిఓ లు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఫీల్డ్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, జిల్లా నీటి సరఫరా విభాగం అధికారులకి దిశానిర్దేశం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..గ్రామ సభలకు కొనసాగింపుగా పల్లె పండుగ చేపడుతున్నాము. వారం రోజులపాటు నిర్వహిస్తున్నాము. గ్రామసభల్లో తీసుకున్న అర్జీలు పరిష్కారానికి, తీర్మానాలను అమలుచేసేందుకు, దాదాపు 4500 కోట్ల వ్యయంతో, 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించాము. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు చేయాలి. ముఖ్యంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు లాంటి పనులు చేపట్టాలి అన్నారు.