కాపు నాయకులపై కక్ష సాధింపా?

కాపు నాయకులపై కక్షసాధింపుల కోసం జీఓ 852 జారీ చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మీడియాతో మాట్లాడిన రాంబాబు..తుని రైలుదగ్దం కేసును అందుకే తిరగదోడుతున్నారన్నారు. ముద్రగడతో సహా 40 మందిపై కేసులకు కుట్ర చేస్తోందని…దీనిపై పోరాడేందుకు కాపు సామాజికవర్గం కార్యాచరణ సిద్ధం చేస్తోందన్నారు.

2014లో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ హామీ ఇచ్చింది చంద్రబాబే… దానిని ప్రశ్నిస్తూ ఉద్యమించిన కాపు నేతలపై తప్పుడు కేసులతో వేధింపులు పెడుతున్నారన్నారు. తుని రైతుదగ్ధంలో అక్రమ కేసులను ఆనాటి వైయస్ జగన్ సర్కార్ ఎత్తేసిందని… కోర్ట్ కొట్టేసిన అవే కేసులను మళ్ళీ విచారించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోందన్నారు. కాపు సామాజికవర్గం అంటే చంద్రబాబుకు కడుపుమంట అని దుయ్యబట్టారు.

విజయవాడ ఏడో అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ రైల్వే కోర్ట్ ఈ కేసులో ఆధారాలు లేవని 1.5.2023న కేసు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చిన రెండేళ్ళ తరువాత ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ఈ కేసును విచారించాలంటూ, హైకోర్ట్‌కు అప్పీల్ చేసేందుకు గానూ ఈ తాజా జీఓను జారీ చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పి సీఎం సంతకం పెట్టి ఆరు నెలలు అయ్యింది. దీనిపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. మరోవైపు కాపులపై కేసులకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో కొత్త డ్రామాలకు సిద్దమయ్యారు అన్నారు.