సినిమా థియేటర్ల బంద్పై నిర్మాతలు వర్సెస్ జనసేన, పవన్ కళ్యాణ్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒకడుగు ముందుఏసి పవన్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణపై వేటు పడింది.
థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో జనసేన పార్టీలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంఛార్జ్గా ఉన్న అత్తి సత్యనారాయణను ఆ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టుగా తెలిపింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అనేది నిరూపించుకునే వరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
అత్తి సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లాలో అనుశ్రీ ఫిల్మ్స్ పేరుతో సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇటీవల థియేటర్ల బంద్ చేయాలని మొట్టమొదట పిలుపునిచ్చింది ఆయనేనని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణపై వేటు వేశారు.
ఇక మరోసారి సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని అన్నారు. సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఆదేశాలు జారీ చేశారు.