భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది… మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు అని ఉగ్రవాదులను హెచ్చరించారు. భారతీయ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ను ఎవరూ ఆపలేరు. భారతదేశ రక్షణ కోసం మేమంతా ఒక్కటే. వీర జవానులు ఏ చర్య తీసుకున్నా అందుకు మద్దతుగా వారి వెంట నడవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ముఖ్యమంత్రి రేవంత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారత వీర జవానులకు దేశ ప్రజలందరూ అండగా ఉన్నారని, భారత దేశ సార్వభౌమాధికారం మీద ఎవరు దాడి చేసినా వారిని వదలిపెట్టబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ గడ్డమీద నుంచి ఇవ్వడానికే ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు.
భారత వీర జవాన్లకు అండగా నిలబడి, వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల ప్రతినిధులు, మాజీ ఆర్మీ అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారులు, సచివాలయ ఉద్యోగులంతా వేలాదిగా ఈ సంఘీభావ ర్యాలీకి తరలివచ్చి మన సైనికులకు అండగా నిలిచినందుకు అందరికీ అభినందనలు అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ర్యాలీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మా వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే. ఈ భూమి మీద నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టేనని తేల్చిచెప్పారు.
మహాత్మాగాంధీ శాంతి సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న 140 కోట్ల భారతీయులు ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ అభివృద్ధి పథం వైపు దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా, ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని కోరుకుంటున్నారు అన్నారు.