ఏపీలో మరోసారి నామినేటెడ్ పోస్టుల హంగామా మొదలైంది. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల్లో కీలకమైన కాపు కార్పొరేషన్ పదవిని దక్కించుకునేందుకు నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇందులో ప్రధానంగా మాజీ స్పీకర్ బాలయోగికి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆకుల రామకృష్ణ పేరు వినిపిస్తోంది. ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాష్ట్ర మంత్రి సుభాష్, రెడ్డి సుబ్రమణ్యం, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలు ఆశీస్సులు కూడా ఉండటంతో తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు రామకృష్ణ.
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ను తీసుకువచ్చారు చంద్రబాబు. ఈ కార్పొరేషన్ ద్వారా కాపులకు ఆర్థిక సాయం, రుణాలు, నైపుణ్య శిక్షణ అందించడం ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కాపులకు మంచి ప్రధాన్యత ఇచ్చింది.
ఇక తాజాగా టీడీపీ కూటమి అధికారంలోకి రాగా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి గట్టి డిమాండ్ ఉంది. అందుకే నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, చినబాబు నారా లోకేష్ కలిసి తమ మనసులోని కోరికను బయటపెట్టారట. ఇక జనసేన నేతలు సైతం కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. పవన్తో ఈ విషయంపై నేతలు చర్చించారు కూడా. దీంతో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గిరి ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.