కవిత దెయ్యం వ్యాఖ్యలపై కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత లేఖ అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్…తెలంగాణకు పట్టిన దయ్యం కాంగ్రెస్ అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం ఉందని కాబట్టే నేతలు లేఖ రాస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుంటేనే మంచిదన్నారు. ఇది అందరూ నేతలకు వర్తిస్తుందన్నారు.

యంగ్ ఇండియన్ కేసులో ఈడీ ఛార్జీషీట్‌లో రేవంత్ పేరును ప్రస్తావించిందన్నారు. నాడు పీసీసీ పదవి కోసం రూ.50 కోట్లు ఇవ్వగా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందన్నారు. కాంగ్రెస్‌కు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఇస్తూ సీఎం పదవిని కాపాడుకుంటున్నారన్నారు. సీఎం ఐనా రేవంత్ రెడ్డి బుద్ది మారలేదన్నారు. 2021లో సీఎంగా యడీయూరప్ప ఉన్నప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌లో నాయకులు ఆయన్ని రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారన్నారు. సీఎంగా యడీయూరప్ప ఉంటే విచారణ నిష్పక్షపాతంగా జరగదని తెలిపారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి చీకట్లో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారన్నారు. చీకట్లో రేవంత్ అమిత్ షా కాళ్లుపట్టుకుని బయటికి వచ్చి ఫోజులు కొడుతున్నారన్నారు.

ఒక్క గ్యారెంటీ అమలు చేయకుండా లక్షా 80 వేల కోట్లు అప్పు చేశారన్నారు. ఈ సంపద అంతా ఢిల్లీ కాంగ్రెస్‌కు అందచేస్తున్నారన్నారు. ఏడాది కాలంలో బీఆర్ఎస్‌పై నిందలు, కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు వేల కోట్ల చందాలు తప్ప రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదన్నారు. ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సివిల్ సప్లై స్కాం, యంగ్ ఇండియన్ కేసులో బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. హెచ్‌సీయూ భూముల విషయంలో ఏజెన్సీలు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. బీజేపీ ఇప్పటివరకు రేవంత్‌ను రక్షణ కవచంలా కాపాడుతోందన్నారు.