ప్రపంచ మేధావులు భయపడుతున్నట్లు యుద్ధం దిశగా అంతర్జాతీయంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాఉత్తర కొరియా ,మధ్య మాటల స్థాయి దాటిపోయి…చేతుల్లో చూపించేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శనివారం వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను హడలెత్తించారు. వరసగా మూడు క్షిపణులు జపాన్ సముద్ర జలాల్లో పడ్డాయి. అమెరికా, దక్షిణ కొరియా దళాల సంయుక్త యుద్ధ కసరత్తులు చేసిన తర్వాత ఈ పరీక్షలు జరగడం గమనార్హం.
అమెరికా-దక్షిణ కొరియాల యుద్ధ కసరత్తులను ఉత్తరకొరియా ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. తమ దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకే యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నారని ఆ దేశం భావిస్తోంది. అయితే వారం రోజుల కిందట ఇరు దేశాధినేతలు మెత్తబడినట్లు కనిపించారు. దీంతో యుద్ధ జ్వాలలు ఆరినట్లనని నిపుణులు భావించారు.
తాజా పరిణామం మరింత ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉంది. ఉత్తరకొరియా శనివారం పరీక్షించిన క్షిపణుల్లో మొదటిది, మూడోది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. రెండో క్షిపణి మాత్రం టార్గెట్ను చేరుకుందని అమెరికాకు చెందిన పసిఫిక్ కమాండ్ పేర్కొంది.
మరో వైపు జపాన్కూడా అప్రత్తమైంది. జపాన్ గుండెల్లో వణుకు పుట్టిన ఉత్తర కొరియాకు ప్రతిగా ఆ దేశం కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. కిమ్ వరుస హెచ్చరికల నేపథ్యంలో జపాన్ కూడా యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది. జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో మౌంట్ ఫ్యూజీ ప్రాంతంలో ఈ లైవ్ ఫైర్ డ్రిల్స్ను ప్రారంభించింది. జపాన్ ఈ విన్యాసాలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2,400 మంది సైనికులు పాల్గొన్న ఈ విన్యాసాలలో పలు యుద్ధ ట్యాంకులు, జపాన్ నూతనంగా అభివృద్ధి చేసిన క్షిపణులను పరీక్షించారు. అన్ని ఆయుధాల పనితీరు బాగుందని ఎటువంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి సిద్దమని ఆ దేశ రక్షణాధికారులు ప్రకటించారు. ఏక్షణాన ఏంజరుగుతుందో నని ప్రపంచం ఆందోళనలో ఉంది.