సినీ పరిశ్రమకు చెందిన వారు కష్టనష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది. సినీ పరిశ్రమకు మద్దతునిస్తూ పలు కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా కష్టాల్లో ఉన్నపావల శ్యామల, కాంతారావు కుటుంబాలను ఆదుకున్నారు. ఇప్పుడు ఒకప్పటి హాస్యనటుడు గుండు హన్మంతరావుకు తెలంగాణ ప్రభుత్వం దన్నుగా నిలిచింది.
కిడ్నీవ్యాధితో బాధపడుతున్న హాస్యనటుడు గుండు హన్మంతరావుకి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.5 లక్షల నగదు ముఖ్యమంత్రి సహాయ నిధి విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. కొంతకాలంగా హన్మంత్రావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది.
ఇంతకుముందు నేను సైతం తరఫున చిరంజీవి నుంచి రూ.2 లక్షల సాయం అందజేశారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షల సాయం చేసింది ప్రభుత్వం. కొంత సాంత్వన పొందే అవకాశం ఉంది. భవిష్యత్లో మరింత సాయం చేసేందుకు చూస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.