- Advertisement -
విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీరును నిరసిస్తూ బ్రాహ్మణ సంఘాలు స్థానిక మాచవరం పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టాయి. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు చేయాలని నిలదీసినందుకే తమ నేత జగన్మోహనరాజును బోండా ఉమ అరెస్టు చేయించారని ఆందోళనకారులు ఆరోపించారు.
బోండా ఉమ ప్రోద్బలంతోనే కార్పొరేషన్ సీఈవో అభిజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వారన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను జగన్మోహనరాజు జరిపిస్తున్నాడనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారన్నారు. జగన్మోహన రాజును వెంటనే విడుదల చేయకుంటే ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణారావు ఈ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.