రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని రోజా మండిపడ్డారు. విద్యార్థిని రిషితేశ్వరి ర్యాంగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటే నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు అప్పుడేం చేశారని రోజా ప్రశ్నించారు. కాల్ మనీ–సెక్స్ రాకెట్ వ్యవహారంలో పోలీసులు ఏం చేశారని నిలదీశారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేను ఎందుకు అరెస్టు చేయలేని రోజా ప్రశ్నించారు. విజయవాడలో మకాం వేసిన చంద్రబాబు సమక్షంలోనే ఇంతటి దారుణాలు జరుగుతుండటం ఎంతవరకు సమంజసమన్నారు.
బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్న జనానికి మద్దతుగా దీక్ష చేసిన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఆమె ఖండించారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వైఎస్ ఆర్ సీపీ అండగా ఉంటుందని ఆర్కే రోజా హామీ ఇచ్చారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులెవరూ ఇబ్బందులు పడటంలేదంటూ ప్రధాన మంత్రి – ముఖ్యమంత్రి చెబుతుండటం హాస్యాస్పదమని రోజా విమర్శించారు.
నోట్ల రద్దు ఈ బాడా బాబులకు ఎప్పుడో తెలుసని అందుకే చంద్రబాబు – వారి మంత్రులు పెట్టుబడుల పేరిట తరచూ విదేశాలకు వెళుతూ తమ వద్ద వున్న నల్లధనాన్ని మార్చుకున్నారని దుయ్యబట్టారు. పైగా జగన్ వద్ద నల్లధనం ఉందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన వద్ద ఏమైన ఉంటే వెతికి పట్టించవచ్చంటూ సవాల్ చేశారు. బీజేపీ-టీడీపీలో ఉన్న వారంతా నల్ల కుబేరులేనని రోజా అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోటానికి జగన్ గడపగడపకు యాత్ర ప్రారంభిస్తే దీనికి పోటీగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలను మొదలు పెట్టారని అన్నారు. ముద్రగడ పాదయాత్రతో జగన్ సంబంధం లేదని ఎవరినో అడ్డుపెట్టుకుని రాజకీయాలు నడపాల్సిన ఖర్మ ఆయనకు పట్టలేదని రోజా స్పష్టం చేశారు.