కొద్ది రోజుల క్రితం టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఎలాంటి ప్రకంపనలు రేపింది. ఇండస్ట్రీలో రసిక రాజుల గుట్టును బట్ట బయలు చేసింది శ్రీరెడ్డి. అవకాశాల పేరుతో పడక సుఖం కోరుతూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ రోడ్డెక్కి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా తన నిరసన తెలిపిన శ్రీరెడ్డికి వివి వర్గాలనుంచి మద్దతు లభించింది. శ్రీరెడ్డి చేసిన పోరాటానికి తెలంగానా ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది.
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అరికట్టేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 984 ను జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్సువల్ హెరాస్మెంట్ కమిటీలో టాలీవుడ్కి చెందిన ప్రముఖులను ప్రతినిధులుగా చేర్చారు. ఈ జీవో ప్రకారం సినీనటి సుప్రియ, సినీనటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ఈ కమిటీలో టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది.
కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా.. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటుగా.. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో సీనియర్ దర్శకుడు సుధాకర్ రెడ్డిలను ఈ కమిటీలో చేర్చారు. ఈ ప్యానల్ కమిటీకి ఛౌర్మెన్గా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న రామ్ మోహన్ రావు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇకపై ఇండస్ట్రీలో ఎవరిపై వేధింపులు జరిగినా ఈ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. పరిశ్రమలో లైంగిక పాల్పడిన వారిని ఈ కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
