బుల్డోజర్ కూల్చివేతలు ఫ్యాషన్‌ కాదు!

బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇళ్ల కూల్చివేతల చర్యలతో అంతా కలవరపడ్డారని యూపీ ప్రభుత్వంకు మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై ఇళ్ల కూల్చివేతల సంబంధించి సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

బుల్డోజర్ కూల్చివేతల తీరు దిగ్భ్రాంతికరమని … బాధితులకు కనీసం ఆశ్రయం పొందే హక్కు కూడా లేదా ? అంటూ ప్రశ్నించింది. ఇలాంటి కూల్చివేతలు పూర్తిగా అమానవీయమైనవి, చట్టవిరుద్ధమైనవి… దేశంలో రూల్‌ ఆఫ్‌ లా (Law) అమలులో ఉందని గుర్తు చేసింది సుప్రీం కోర్టు.

ఈ తరహా కూల్చివేతలు ఒక ఫ్యాషన్‌గా మారకూడదు. బాధితులకు ఆరువారాలలో రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలి, అని సుప్రీంకోర్టు ప్రయాగ్‌రాజ్‌ అభివృద్ధి సంస్థకు ఆదేశించింది. ఈ చర్యలు తప్పుడు సంకేతాలను ఇస్తాయని మండిపడింది.

2023లో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌కు చెందిన భూమిగా భావించి..అక్కడి నివాసాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా కూల్చివేసిందని బాధితులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. వీరిలో ఒక న్యాయవాది, ఒక ప్రొఫెసర్‌తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు. అయితే, హైకోర్టులో వేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.