తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రలు గత రెండు మూడు రోజులుగా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇంటర్ బోర్డ్ తప్పిదం వల్ల దాదాపు 20 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తల్లి, దండ్రుల ఆందోళనతో ఇంటర్ ఫలితాల అంశంపై ఇప్పటికే త్రిసభ్య కమిటీని వేసిన సంగతి తెలిసిందే. త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే నిందితులుగా తేలితే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవని మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటర్ లో ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. ఉత్తీర్ణులైన విద్యార్థులు, రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోరితే గత విధానమే పాటించాలని సూచించారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ త్వరగా పూర్తి చేయాలని, విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ నిర్వహించాలని ఆదేశించారు.
రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు.ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులు కొందరు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యలను అత్యంత దురదృష్టకరమైన సంఘటనలుగా సిఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.