తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల శంఖారావన్ని పూరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలుండగా 14 ఎంపీ స్థానాలే లక్ష్యంగా కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రధానంగా ఈ ఎన్నికల తన 100 రోజుల పాలనకు రెఫరెండం అని చెప్పిన సీఎం రేవంత్…అందుకు తగ్గ ప్రణాళికను రెడీ చేశారు.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న రేవంత్…స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కేడర్ని కలుపుకుపోవాలని సూచిస్తున్నారు. ఇక ఈ నెల 14 నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు రేవంత్.
ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మూడు బహిరంగసభలతో పాటు రోడ్ షోలు ఉండేలా మ్యాప్ సిద్ధం చేశారు. ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్..మరోవైపు పదవుల ఆశ చూపుతూ పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి వలసలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్లో చేరని నేతలను సైలెంట్గా ఉండేలా తన మార్క్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రధానంగా పదేళ్ల బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేలా రేవంత్ ప్రసంగం ఉండనుంది. అలాగే కొత్తగా చేరిన నేతలు, పాత వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను నియమించగా వారు క్షేత్ర స్థాయిలో రిపోర్టును నాయకత్వానికి అందిస్తుండటంతో రేవంత్ టార్గెట్ 14 ఎంతవరకు ఫలిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.