వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్రంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో మహా పాదయాత్రను చేపట్టనున్నారు. వచ్చె నెల 6 నుంచి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇది సుధీర్ఘమైన పాదయాత్ర. పాదయాత్ర ఎలా చేపట్టాలనెదానిపై పార్టీ నాయకులతో ఇప్పటికె చర్చించి రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు.
మొత్తం 3 వేల కిలోమీటర్ల మేర, 13 జిల్లాల్లో, ఆరు నెలలపాటు (అంటే, 180 రోజులు), 125 నియోజకవర్గాల మీదుగా వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. వారంలో ఒక రోజు హైద్రాబాద్లో న్యాయస్థానం యెదుట అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సి వుంటుంది. అందుకె ఆరోజు పాదయాత్రకు విరామం ఇస్తారు.
సుదీర్ఘపాదయాత్రలో సుమారు 2 కోట్ల మంది ప్రలజను ప్రత్యక్షంగా జగన్ కలసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. పాదయాత్రలో దాదాపు 120 భారీ బహిరంగ సభలు, ఎక్కడికక్కడ రచ్చబండ కార్యక్రమాలు, పల్లె నిద్ర వంటివాటికీ వైఎస్సార్సీపీ ప్లాన్ చేసింది. 10 వేలకు పైగా గ్రామాల్లో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యల్ని తెలుసుకోనున్నారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు.
ఒక పక్క జగన్ పాదయాత్ర, మరో వైపు పార్టీ శ్రేణుల ప్రత్యేక కార్యక్రమాలతో ఈ ఆరు నెలలు రాష్ట్రమంతాటా వైసీపీ జెండాలే ఎగరనున్నాయి. ఓ జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోంటే, మిగతా 12 జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఆ పాదయాత్రకు మద్దతుగా కనీ వినీ ఎరుగని రీతిలో జరగనున్నాయట.
మొత్తమ్మీద, న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వకపోవడంతో జగన్ పాదయాత్రపై నెలకొన్న అనుమానాల్ని వైఎస్సార్సీపీ పటాపంచలు చేసిందన్నమాట. ప్రజలను ఎలా ఆకట్టుకుంటారు…? రాష్ట్ర రాజకీయాల్లో ప్రజా సంకల్ప యాత్ర ఎలాంటి ప్రకంపనలు సృష్టించనుంది..? పాదయాత్ర ద్వారా జగన్ అధికారంలోకి వస్తారా అంటె వేచిచూడాల్సిందె.