టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండగా చంద్రబాబుపై మరో పిటిషన్ దాఖలు చేసింది సీఐడీ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీపీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది.ఈ కేసులో చంద్రబాబును విచారించాలని కోరింది.
ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్ పేర్లను సైతం చేర్చింది. ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-3గా లింగమనేని రమేశ్, ఏ-4 లింగమనేని రాజశేఖర్, ఏ-5గా అంజనీ కుమార్, ఏ-6గా లోకేశ్లపై కేసు నమోదు చేసింది. దీంతో వరుసగా చంద్రబాబుకు షాకుల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్కు లబ్ది కలిగించేలా ఇన్నర్ రింగ్ అలైన్మెంట్స్ మార్చారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ చేపట్టింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక సీఐడీ అధికారులు అమరావతి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఒక్కొక్కటి బయటికి తీస్తూ కేసులు నమోదు చేస్తుండటంతో టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.