గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని సంచలన వ్యాఖ్యలు
కేంద్రాన్ని ఏనాడూ ప్రశ్నించరు.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మిన్నకుండిపోతారు.. రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చి మట్టి, చెంబెడు నీళ్లు ఇవ్వడం.. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం.. ప్రత్యేక హోదా పక్కనపెట్టి.. ప్రత్యేక ప్యాకేజీ… ఇలా ఏవేవో చేసి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చిప్ప చేతికి ఇస్తోంది. అయినా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో ఏ మార్పు రాదు.
నోరెత్తి కేంద్రాన్ని ఒక్క మాట అనలేని పరిస్థితి. కేంద్రం ఏం చేసినా మద్దతు తెలపడమో సైలెంట్గా ఉండడమో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అలా చేయడం ఎందుకు బీజేపీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేస్తే మంచిది కదా అని ఓ ఎమ్మెల్యే సలహా ఇచ్చారు. ఈ సలహా వింటే మరీ నిజమే కదా! అని అందరికీ అనిపిస్తోంది.
ఆ సలహా ఇచ్చింది వైఎస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇచ్చారు. టీడీపీని బీజేపీలో వెంటనే విలీనం చేయాలంటూ నాని ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. కేంద్రం నుంచి ఏపికి నిధులు రావాలంటే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే రాష్ట్రానికి మేలు చేస్తుంది అని చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదాపై విజయవాడలో బుధవారం నిర్వహించిన ఓ చర్చా వేదికలో నాని మాట్లాడారు. ఆ సందర్భంలో ఈ సలహా ఇచ్చారు.
‘ఓటుకునోటు’ కేసులో దొరికిన తర్వాత చంద్రబాబు కేంద్రం చేతిలో కీలుబొమ్మలాగ తయారైనట్లు నాని ఆరోపించారు. కేవలం తనపై ఉన్న కేసు వల్లే చంద్రబాబు కేంద్రంతో గట్టిగా మాట్లాడలేకున్నట్లు ధ్వజమెత్తారు. చంద్రబాబు లాగ జగన్ వెన్నుపోటు రాజకీయాలు చేయలేదన్నారు. ప్రత్యేకహోదా కోసం వైసిపి ఎంపిల రాజీనామాలు, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో జగన్ ప్రకటనలు విన్న తర్వాత చంద్రబాబుకు ఏం మాట్లాడాలో కూడా దిక్కు తెలీటం లేదని ఎద్దేవా చేశారు.
మూడున్నరేళ్ల పాటు ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తోందంటూ చెప్పిన చంద్రబాబు ఇపుడు మాత్రమే ఎందుకు అడ్డం తిరుగుతున్నారో అందరికీ తెలుసన్నారు. ఏపీకి కేంద్రం ఏ విధంగానూ సాయం చేయకపోయినా ఇంతకాలం చంద్రబాబు ఎందుకు కేంద్రం భజన చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అందుకే మూడేళ్ల నుంచి ప్రత్యేకహోదా కోసం పోరాటం చేసింది ఒక్క వైఎస్సార్సీపీనే అనే విషయం అని గుర్తుచేశారు.