వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తుంటె…మరో వైపు ఆపార్టీ నుంచి వలసలను టీడీపీ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికె ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు పచ్చఖండువా కప్పుకున్నారు. అయినా వలసను ప్రోత్సహించడం ఆపడంలేదు టీడీపీ. తాజాగా వైసీపీలో ప్రముఖ నాయకుడి కోసం ప్లాన్ చేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన కలకలం రేపుతోంది. వైసీపీ నుండి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూనే ఉందని ఈ ప్రకటన మరింత బలాన్ని చేకూర్చింది.
మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యాలు.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి. ముఖ్యంగా వైసీపీలో అలజడి మొదలయ్యింది. అసలు విషయానికి వస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు హాజరైన మంత్రి అచ్చెన్నయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు.
వైసీపీ ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ.. జగన్ పాదయాత్ర ముగిసే సమయానికి ఆ పార్టీలో కీలకనేతలు ఎవరూ లేకుండా చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఒక కీలక నేత కోసం ఎదురు చూస్తున్నామని ఆయన కనుక టీడీపీలో చేరితే.. వైసీపీ ఖాళీ అయిపోయినట్టేనని ఆయన అన్నారు. వైసీపీలో ఇక జగన్..ఆయన తల్లి, చెల్లి మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.
మరో రాజ్యసభ సీటు దక్కకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక టీడీపీలో చేరితే.. వైసీపీ కి రాజ్యసభలో అభ్యర్థిని నిలిపే బలం కూడా ఉండదు. మంత్రి మాటలు వింటుంటే రానున్న ఎన్నికలను కీలక మలుపులు తిప్పే దిశగా టీడీపీ పథకం రచించిందని అర్థమౌతోంది.
కాగా.. ఇప్పుడు మంత్రి మాటలు సంచలనం రేపాయి. ఇప్పటికే 23మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. కాగా.. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేల్లో టీడీపీ ఎదురు చూస్తున్న కీలక నేత ఎవరా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. కనీసం ఇప్పుడైనా వైసీపీ ముందు జాగ్రత్త తీసుకుంటుందా లేకా పోతే పోనీ అని ఊరుకుంటుందా..చూడాలి.