శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శివాజీ మండిపడుతున్నారు. పవన్ తనపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. తనపై చేసిన ఆరోపనలను నిరూపించాలని పవన్కు సవాల్ విసిరారు.
జీఎస్టీ విన్నాం. కానీ, పలాసలో మాత్రం అదనంగా అల్లుడు ట్యాక్స్ కట్టాలి’ అంటూ కాశీబుగ్గలో నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. వ్యక్తిగతంగా తన కుటుంబంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు లీగల్ నోటీసులు పంపినట్టు చెప్పారు.
కాశీబుగ్గలో నిన్న జరిగిన పవన్ కల్యాణ్ బహిరంగ సభా ప్రాంగణాన్ని టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్దిచేశారు. పవన్ రాకతో సభా ప్రాంగణం అపవిత్రం అయ్యిందని అందుకే పసుపు నీళ్లతో శుద్దిచేశామని టీడీపీ కార్యకర్తలు చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలకు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ నిన్నటి సభలో ఆరోపించిన సంగతి తెలిసిందే.