ఎన్నికలు దగ్గర పడుతున్న ఏపీలో ఫిరాయింపు రాజకీయాలకు తెగబడుతానే ఉంది టీడీపీ. ఇప్పటికే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేను సంతో కూరగాయల్లా కొన్న టీడీపీ ఇంకా ఫిరాయింపులకోసం పాకులాడుతోంది. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించండంటూ బాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అందుకు విరుద్దంగా ఏపీలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తూనే ఉన్నారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైసీపీ నుంచి టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని వైసీపీ శాసన సభాపక్ష ఉప నాయకుడు – మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను జగన్ వెంటే ఉంటాననీ, పార్టీ మారబోనని వారికి స్పష్టం చేశానన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన జగన్ ను మోసం చేయబోనని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.
తనకు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశ ఉండేదని.. 2014లో జగన్ ఆశీస్సులతో తన కల నెరవేరిందని ముత్యాల నాయుడు చెప్పుకొచ్చాడు. డబ్బు కోసం పార్టీలు మారే మనిషిని తాను కాదని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.