టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత డి.శ్రీనివాస్ సొంత గూటికి చేరనున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానిక నేతలు కేసీఆర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే నర్సారెడ్డి, రాములు నాయక్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసులో చేరారు. తమ పార్టీలో చేరిన రాములు నాయక్, నర్సారెడ్డిలను కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా అభినందించారు. వీరితో పాటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోగా… డీఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్న కొండా దంపతులు కూడా కారు దిగి కాంగ్రెస్కు జై కొట్టారు.
డీఎస్ ఎప్పుడు కాంగ్రెస్లో చేరతారనే దానిపై కొంతకాలంగా కాంగ్రెస్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో శనివారం ఉదయం రాహుల్ సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం ఆయన శుక్రవారమే దిల్లీ చేరుకున్నారు.
మరోవైపు కాంగ్రెస్లో చేరితే డీఎస్ తన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికప్పుడు ఆయన పదవికి వచ్చిన ముప్పేమీ ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్లో చేరిన డీఎస్… మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.