కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అందరూ చెప్పేది ‘వంగవీటి మోహనరంగా’ పేరు. అయితే ఒకప్పుడు వంగవీటి మోహనరంగా ఇమేజ్ వేరు.. ఇప్పుడు ‘వంగవీటి’ ఇమేజ్ వేరు. బెజవాడ రక్తచరిత్రకు సంబంధించి వంగవీటి-దేవినేని నెహ్రూ వర్గాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవినేని వైపు కమ్మ సామాజిక వర్గం, వంగవీటి వైపు కాపు సామాజిక వర్గం మొగ్గు చూపాయి. అలా, కాపు సామాజిక వర్గానికి ప్రతినిథిగా వంగవీటి మోహనరంగా మారిపోయారు.
స్వయానా రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, తన తండ్రి లెగసీ పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయంగా తన తండ్రి పేరు చెప్పుకుని రాధా సాధించిందేమీ లేదు.. అదే సమయంలో, ఆయన వల్ల కాపు సామాజిక వర్గానికీ ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా, వైఎస్సార్సీపీలో ఇప్పుడు ‘రంగా’ పేరుతో రచ్చ షురూ అయ్యింది. ఇది జగన్కు ఇబ్బంది కలిగించే అంశమే.
రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను గౌతమ్రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు వైఎస్ జగన్. రాధ వల్ల నిజానికి వైఎస్సార్సీపీకి ఒరిగిందేమీ లేదు. కానీ, గౌతమ్రెడ్డి మంచి వాగ్ధాటి వున్న నేత. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంపై వచ్చే ప్రతి విమర్శనీ గౌతమ్రెడ్డి మీడియా వేదికలపై ఘాటుగా తిప్పికొట్టడంలో సమర్థుడు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాధని వెనకేసుకురాకపోతే, కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవాల్సి వస్తుందని వైఎస్ జగన్ భావించి వుండొచ్చనె వార్తలు వినిపిస్తున్నాయి. రాధ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే మాత్రం, ఇప్పుడాయన్ని జగన్ వెనకేసుకురావడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదనే విషయం అర్థమవుతుంది. ఇద్దరిని పిలిచి మాట్లాడి గొడవను సద్దుమనిగే విధంగా నిర్ణయం తీసుకొంటె బాగుండేదనె వార్తలు వినిపిస్తున్నాయి.