ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. జైట్లీ ప్రకటనతో భాజాపా ,టీడీపీ మధ్య బంధం దాదాపు తెగిందనే చెప్పాలి. కేంద్రంలో,రాష్ట్రలో మంత్రి వర్గంలోఉన్న ఇరు పార్టీల నేతలు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. తాజాగా ప్రత్యేక హోదాపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందన్న విషయం తనకు ముఖ్యం కాదని, విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలనూ అమలు జరపాలన్నదే తన డిమాండని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై సంతకం పెడితే మద్దతిస్తాం. ఏ పార్టీ అయినా నాకు అభ్యంతరం లేదన్నారు. సంతకం పెట్టు ఇస్తా… నాకు కావాల్సినది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాపై ఎవడు సంతకం పెడితే వాడికి మద్దతిస్తానని తెగేసి చెప్పారు.
ఇప్పుడే మూడో కూటమిపై వ్యాఖ్యానించడం సరికాదని, ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో తమకు అనుకూలంగా ఉండే పార్టీలతో జతకట్టే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఒకే అబద్ధాన్ని తనకు అనుకూలమైన మీడియా ద్వారా పదేపదే చెప్పించి, దాన్ని నిజం చేయించే గోబెల్స్ సిద్ధాంతాన్ని ఇప్పుడు చంద్రబాబు పాటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అవతలి వ్యక్తి ఏం చేస్తున్నా బండలేస్తూ, బురద జల్లుతూ ప్రచారం సాగించే వ్యక్తి ఆయనని అన్నారు.