అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించి వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ తన స్థానాన్ని కోల్పోయారు. ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియాను వెనక్కి నెట్టేసిన దక్షిణాఫ్రికా అగ్రస్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వన్డేల్లో తన మొదటి ర్యాంకును కోల్పోయాడు. అద్భుత ఫామ్లో ఉన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఏబీ డెవిలియర్స్ 879 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 877 పాయింట్లతో ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో ర్యాంకుకు పడిపోయాడు. బంగ్లాదేశ్తో జరుగుతోన్న వన్డేల్లో భాగంగా రెండో వన్డేలో డెవిలియర్స్ 176 పరుగులు బాదిన విషయం తెలిసిందే.
నాలుగు నెలల తర్వాత తిరిగి జట్టులో చేరిన డివిలియర్స్ బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో 176 పరుగులు బాది కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. దీంతో ఎకాఎకిన రెండు స్థానాలు ఎగబాకాడు. భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానంతో సరిపెట్టుకోగా ధోనీ 12, ధవన్ 14 స్థానాల్లో కొనసాగుతున్నారు
బౌలింగ్ విభాగంలో పాకిస్థాన్ బౌలర్ హసన్అలీ మొదటి స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో బూమ్రాకు ఆరోస్థానంలో ఉండగా, అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికాలు రెండూ 120 పాయింట్లతో సమానంగానే ఉన్నా రెండు జట్ల మధ్య డెసిమల్ పాయింట్ల తేడా ఉన్నట్టు ఐసీసీ తెలిపింది.