సిడ్నీలో ఆసిస్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో భారత్ తొలిరోజు తన సత్తా చాటింది. ఆసిస్ బౌలర్లపై భారత బ్యాట్స్మేన్లు అధిపత్యం ప్రదర్శించారు. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (130 బ్యాటింగ్: 250 బంతుల్లో 16×4) అజేయ శతకం బాదడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 303/4తో తిరుగులేని స్థితిలో నిలిచింది. చతేశ్వర్ పుజారా(130 బ్యాటింగ్; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39 బ్యాటింగ్; 58 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అయితే పుజారా, మాయాంక్ రెండో వికెట్కు 116 పరుగులు జోడించడంతో భారత్ పటిష్ఠ స్థితికి చేరుకుంది. అర్ధశతకం సాధించిన అనంతరం మయాంక్ అవుటయ్యాడు.
మయాంక్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. విరాట్ కొహ్లీతో కలిసి పుజారా మరో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. మూడో వికెట్కు కొహ్లీ-పుజారా 54 పరుగులు జోడించారు. 59 బంతుల్లో 23 పరుగులు చేసిన కొహ్లీ ..జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో కీపర్ టిమ్ పెయిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనంతరం పుజారాతో కలిసి 48 పరుగుల్ని జత చేసిన రహానే(18; 55 బంతుల్లో 1 ఫోర్) నాల్గో వికెట్గా ఔటయ్యాడు. అటు తర్వాత హనుమ విహారితో కలిసి ఇన్నింగ్స్ను పుజారా చక్కదిద్దాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్వుడ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా…మిషెల్ స్టార్క్, నాథన్ లియోన్ చెరో వికెట్ తీశారు.