సఫారీతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్వదేశంనుంచే కాకుండా ఇతర దేవాల ఆటగాల్లనుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా సౌతాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత క్రికెట్ జట్టును ఎక్కువ కాలం ముందుకు నడిపే శక్తి సామర్ధ్యాలు విరాట్ కొహ్లీకి లేవని అభిప్రాయపడ్డారు. వాండరర్స్ మైదానంలో దక్షిణాఫ్రికా భారత్ల మధ్య చివరి టెస్టుకు ముందు మీడియాతో ఆయన మాట్లాడారు. కొహ్లీ క్రికెట్ ప్రపంచంలో గొప్ప ఆటగాడే కావొచ్చని, జట్టు సభ్యుల గురించి పట్టించుకోని గొప్ప ఆటగాడు నాయకుడు ఎన్నటికీ కాలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
22 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్గా పగ్గాలు అందుకున్న స్మిత్.. కెప్టెన్ అనే వ్యక్తితో జట్టులోని ఆటగాళ్లందరూ కలసి నడవాలని చెప్పారు. అందుకు నాయకుడు నిరంతరం వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉండటం మంచిదని చెప్పారు. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో కొహ్లీ మాటే వేదంలా భావిస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పారు.
విరాట్ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని, ఒక నిర్ణయంపై డిబేట్ జరిగితేనే సరైన జవాబు దొరుకుతుందని అన్నారు. కొహ్లీకి చుట్టు పక్కల ఉండే వ్యక్తుల్లో ఎవరైనా ఈ పని చేయాలని చెప్పారు. అప్పుడే నిర్మాణాత్మక దిశగా సాగే ఆలోచన కొహ్లీని మచ్చలేని నాయకుడిగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది విదేశీ గడ్డలపై భారత్ ఆడాల్సిన మ్యాచ్ల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇది విరాట్పై ఒకింత ఒత్తిడిని పెంచుతుందని అన్నారు.