వైజాగ్: పది సంవత్సరాలపాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఏపీలో అభివృద్ది సాధనకు ప్రయత్నిస్తూ ఉంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఉన్న ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణంపై ఎక్కువ దృష్టి సారించారు.
రాజధానితో పాటు రాష్ట్రాన్ని అందంగా తీర్చిదిద్దే క్రమంలో పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో బీచ్లో లవ్ ఫెస్టివల్ వ్యవహారం చంద్రబాబుతో పాటు టీడీపీ పార్టీనే ఇరకాటంలోకి నెట్టింది.
ఈ ఫెస్టివల్ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 14 వరకు బీఎల్ఎఫ్ -2017 పేరిట జరగనుంది. సుమారు 9వేల మంది దేశ, విదేశీ ప్రేమ జంటలను ఈ ఉత్సవానికి ఆహ్వానించనున్నట్టు సమాచారం. ప్రముఖలతో ఆటలు, పాటలతో పాటు అచ్చం విదేశాల మాదిరిగా పూర్తి వాతావరణం మారనుంది. ఇలాంటి ఉత్సవం దేశంలో ఒక్క గోవాలో తప్ప మరెక్కడా జరగలేదు. లవర్స్కు ప్రత్యుక టెంట్లను కూడా ఏర్పాటు చేయనుండగా ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్ ధరను కూడా నిర్ణయించనున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట.
లవర్స్కు ప్రత్యేకమైన ఫిబ్రవరి 14వ తేదీన వైజాగ్ బీచ్లో లవ్ ఫెస్టివల్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విమర్శలు ఎదురౌతున్నాయి. ఎవరో కొంతమంది నుంచే కాకుండా ఏకంగా మిత్రపక్షం బీజేపీ నుంచి కుడా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. వైజాగ్ పేరును దెబ్బతీసే బీచ్ లవ్ ఫెస్టివల్ అవసరమా అని విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. పర్యాటక రంగం అభివృద్దికి ఇలాంటి ఫెస్టివల్ను ఎంచుకోవడం తగదని, యువత పెడదోవ పట్టే ప్రమాదముందని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల దృష్ట్యా ఇలాంటివీ మంచిది కాదంటూ పలువురి నాయకులతో పాటు స్థానిక ప్రజలు, మహిళ నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ బీచ్లో లవ్ ఫెస్టివల్ చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టినట్టే కనబడుతోంది.