భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుపై హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తీవ్ర ఆరోపణలతో కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు, ప్రైవేట్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేశారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల ద్వారా వెలుగులోకి వచ్చాయి.
బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. రేగా కాంతారావు తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడని, యూట్యూబ్ చానెల్ పేరుతో ఒక ప్లాట్కు పిలిపించి తనను లైంగికంగా వేధించాడని యువతి ఆరోపించింది. అంతేకాకుండా తన వద్ద ఉన్న ప్రైవేట్ ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆయన తనను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇవేకాక, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తన దగ్గర రూ. 4 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె వాపోయింది. బాధితురాలిచ్చిన బలమైన ఆధారాలు, ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు ఈనెల 26నే రేగా కాంతారావుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరోవైపు తనపై పంజాగుట్ట పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వెంటనే రంగంలోకి దిగారు. పోలీసుల దర్యాప్తును ఎదుర్కొనే బదులు, తనపై నమోదైన ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. మాజీ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్ ఆరోపణలు రావడంతో పాటు ఈ కేసులో కోర్టు విచారణ జరుగుతుండటం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
