ఇటీవల సెల్ ఫోన్ చోరీలు బారీగా పెరిగిపోయాయి. తెలివిమీరిన దొంగలు ఈమధ్య కాలంలో సెల్ ఫోన్ తో పాటు అందులో ఉన్న డబ్బును కూడా మాయం చేస్తున్నారు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా హైదరాబాద్లోని కుషాయిగూడ ప్రాంతంలో ఇలాంటి ఘటనే కలకలం రేపింది. స్థానిక వీకెండ్ మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్నారు. బాధితులు తేరుకునేలోపే వారి యూపీఐ ఖాతాల నుంచి క్షణాల్లో నగదు మాయమైంది. ఒకరి ఫోన్ నుంచి రూ. 20,000 కాజేయగా, మరొకరి ఖాతా నుంచి రూ. 60,000 హాంకా అయింది. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే ఇలాంటి బాధితులు పెద్ద సంఖ్యలో ఉండటంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో వరుస కేసులు నమోదవుతున్నాయి.
కేవలం హైదరాబాద్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ ముఠాల ఆగడాలు మితిమీరాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యాపారి, రైతు ఫోన్లను కొట్టేసిన దొంగలు వారి యూపీఐ నుంచి ఏకంగా రూ. 1.80 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో ఏపీ, ఒడిశాకు చెందిన ఒక యువకుడితో పాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి 27 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోనూ ఓ అపరిచితుడు వ్యాపారి ఫోన్ చోరీ చేసి, పెట్రోల్బంక్లో రూ. 55 వేలు చెల్లించాడు. ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాలు హల్చల్ చేస్తున్నాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్ హెచ్చరిస్తున్నారు.
వృద్ధులు, నిరక్షరాస్యులు, మహిళలే లక్ష్యంగా ఏపీ, ఒడిశా, యూపీ, కర్ణాటకకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలు ఈ చోరీలకు పాల్పడుతున్నారు. బిర్యానీ, రూ. వెయ్యి కూలి ఆశ చూపించి కొందరితో ఫోన్లు కొట్టించి ముఠా నాయకుడికి అప్పగిస్తారు. దుకాణాలు, రైతుబజార్లు, మార్కెట్లలో కాపుకాసి, యూపీఐ లావాదేవీల సమయంలో పిన్ నంబర్ గమనిస్తారు. బాధితులు ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఫోన్ కొట్టేసి పరారవుతారు. పెట్రోల్బంక్లు, దుకాణాల నిర్వాహకులకు కమీషన్ ఆశ చూపి నగదు మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు. పెద్దఎత్తున పోగైన ఫోన్లను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. 0000, 1234 లాంటి తేలికపాటి యూపీఐ పిన్ నంబర్లను అస్సలు వాడొద్దు. ఫోన్ పోయిన వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేయించి, బ్యాంకు కస్టమర్కేర్కు సమాచారం ఇవ్వాలి. డిజిటల్ లావాదేవీలకు బలమైన పిన్తో పాటు ఫింగర్ప్రింట్, ఫేస్ ఐడీ వంటి సెక్యూరిటీ ఫీచర్లను విధిగా ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
