విదేశాలనుంచి ఇండియాకు దొంగ బంగారాన్ని తరలించడానికి స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా చెన్నై విమానాశ్రయంలో అయుబ్ ఖాన్ అనే వ్యక్తి, దొంగ బంగారాన్ని తరలిస్తూ కష్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. దొంగ బంగారాన్ని తరలించడానికి ఇతను ఎంచుకున్న మార్గానికి ఫిదా అవ్వాల్సిందే.
చెన్నైకి చెందిన ఆయుబ్ ఖాన్ (32) కువైట్ నుంచి ఓమన్ ఎయిర్లైన్స్ విమానంలో సోమవారం చెన్నై విమానాశ్రయం చేరుకున్నాడు. అతను గ్రీన్ చానల్ మార్గంలో బయటకు వెళ్తున్నాడు. అతనికి స్వాగతం తెలిపేందుకు ముస్తఫా (27) అనే వ్యక్తి వేచి ఉన్నాడు.
కస్టమ్స్ అధికారులు ఆయుబ్ ఖాన్ను మళ్లీ లోపలికి పిలువగా.. లోపలికి వెళ్లడానికి నిరాకరించడమే కాకుండా, తనిఖీలు ముగించుకునే కదా బయటకు వచ్చానని అధికారులతో వాగ్వాదం చేశాడు. దీంతో అతనిపై అనుమానంతో మళ్లీ తనిఖీ చేశారు.
అతను బంగారం తెచ్చిన విధానాన్ని చూసి అధికారులు అవాక్కయ్యారు. స్త్రీలు ధరించే జాకెట్ లో బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా, దాచి, దానిపై ఎంబ్రాయిడరీ చేయించి తీసుకొచ్చాడు.జాకెట్లలో దాచిన బంగారం బయటపడింది. దాదాపు అర కిలో బంగారాన్ని 11 ముక్కలుగా చేసి జాకెట్లలో చొప్పించాడని, దీని విలువ రూ. 15 లక్షలు ఉంటుందని చెప్పిన అధికారులు అయుబ్ తో పాటు, అతనికి స్వాగతం పిలకేందుకు వచ్చిన ముస్తఫానూ అరెస్ట్ చేశారు.