తెలుగు సినీ ప్రపంచంలో కమెడియన్ గా మెప్పించిన వేణుమాధవ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సికీంద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హాస్యనటుడు వేణు మాధవ్ సినీ రంగంలోకి ప్రవేశించక ముందు హిమాయత్ నగర్లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆఫీసు ఫోన్కి ఎక్కువగా వేణు మాధవ్ పర్సనల్ కాల్స్ వచ్చేవి దీంతో ఆయనను అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు.
అసెంబ్లీలో పని చేస్తున్న సమయంలో వేణు మాధవ్ రవీంద్ర భారతికి తరచుగా వెళ్లేవారట. ఒకసారి ఆకృతి సంస్థ వాళ్లు మాటల రచయిత దివాకర్ బాబుకి చేసే సన్మాన కార్యక్రమంలో వేణు మాధవ్ ఇచ్చిన చిన్న ప్రదర్శను అక్కడున్న వారందరినీ ఆకట్టుకుందట. అక్కడే ఉన్న అచ్చి రెడ్డి, కృష్ణారెడ్డి వేణుకి సినిమాలో అవకాశం ఇస్తామని అన్నారు. అన్నట్టుగానే ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన సంప్రదాయం సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలయ్యింది.
తొలి ప్రేమ చిత్రంలో అమ్మాయిలపై ఆయన చెప్పిన చాంతాడంత డైలాగ్తో వేణు మాధవ్ కు మంచి పేరు రావడంతో అందరి దృష్టిలో పడ్డాడు. దిల్ సినిమా కూడా మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, సై, ఛత్రపతి, మొదలైనవి. నల్లబాలు నల్ల తాచు లెక్క అని వేణు మాధవ్ చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన రాణించారు. పలు కార్యక్రమాలకి ఆయన యాంకర్గా కూడా పని చేశారు. రాజకీయాలలోను చురుకుగా పని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాలలో హీరోగా చేశారు. చివరి సారిగా వేణుమాధవ్ రుద్రమదేవి చిత్రంలో కనిపించారు.