సోషల్ మీడియా పిచ్చి మనుషుల ప్రాణాలను తీసే వరకు వెళ్తోంది. బెంగళూరులో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్కు గురిచేస్తోంది. రీల్స్ ఎక్కువ చేస్తోందనే కోపంతో కట్టుకున్న భార్యే భర్త చేతిలో హత్యకు గురైంది.
బీహార్కు చెందిన ధీరజ్ కుమార్, రీమా కుమారి కొద్దికాలం ప్రేమించుకున్నారు. పెద్దలొప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత బతుకుదెరువు కోసం బెంగళూరుకు వచ్చి కుంబళగోడులో ఓ అద్దె గదిలో కాపురం పెట్టారు. కొత్తలో అంతా బాగానే ఉన్నా, కొద్దిరోజుల తర్వాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
బెంగళూరు వెళ్లిన తర్వాత రీమా రోజంతా సోషల్ మీడియాలో రీల్స్ చేయడమే పనిగా పెట్టుకుంది. భర్తను పట్టించుకోవడం మానేసింది. అంతేకాకుండా భర్తతో శారీరక సంబంధానికి నిరాకరించడంతో పాటు, అతనికోసం వంట చేయడం కూడా మానేసింది. తిరిగి బీహార్ వెళ్లిపోదామని భర్తపై నిత్యం ఒత్తిడి తెస్తుండటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ విషయమై జూలై 25న భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఆ సమయంలో రీమా కలప కర్రతో భర్తపై దాడికి దిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన ధీరజ్.. ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి గదికి తాళం వేసి బీహార్కు పారిపోయాడు. పోలీసులు టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. చిన్నపాటి సోషల్ మీడియా మోజు దంపతుల జీవితాన్ని నాశనం చేసింది.
