AP Assembly:బాలయ్య Vs అంబటి!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుకున్నట్లుగానే టీడీపీ నేతలు రచ్చ చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిస్తూ వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా దానికి స్పీకర్ తొసిపుచ్చారు. ఇక స్పీకర్ అనుమతివ్వకపోవడంతో పోడియం ముందుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ రచ్చ చేశారు. ఈ సందర్భంగా సభలో మీసాలు తిప్పారు బాలయ్య. దీంతో రభస మొదలై..టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేసే వరకు వెళ్లింది.

టీడీపీ ఎమ్మెల్యేల తీరును తప్పుబట్టారు మంత్రి అంబటిరాంబాబు. బాలకృష్ణ మీసాలు తిప్పుతూ రెచ్చగొడుతున్నారని…టీడీపీ సభ్యుల తీరుతో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్యకు సిద్ధమని మంత్రి బుగ్గన ప్రకటించినా టీడీపీ సభ్యుల ఆందోళన ఆగలేదు. టీడీపీ నేతలు అర్థం పర్థం లేని నోటీసులు ఇస్తున్నారని బుగ్గన వెల్లడించారు. దీనిపై బీఏసీలో చర్చిద్దామని చెప్పిన టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు.

అంబటి మాట్లాడుతుండగా రండి చూసుకుందాం అంటూ బాలకృష్ణ సైగలు చేయడంతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. బాలకృష్ణ కు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి.. ఇక్కడ కాదని అంబటి చురకలు అంటించారు. దమ్ముంటే చర్చకు రావాలని బాలయ్యకు అంబటి సూచించగా బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడ గొట్టారు. మొత్తంగా తొలిరోజు టీడీపీ సభ్యుల ఆందోళన.మీసాలు తిప్పడంతో గందరగోళం నెలకొంది.