సీఎం జగన్ ముందుచూపు,విద్యారంగంపై ప్రత్యేక దృష్టి వెరసీ ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాయి. ఇక ప్రధానంగా జగన్ సర్కార్ విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు చక్కటి ఫలితాన్నిస్తున్నాయి. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది.
విద్య అందుబాటు అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ విద్య అందుబాటు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవచ్చు అని పేర్కొంది.
కేంద్రం నిర్దేశించిన ఐదు అంశాల్లో జాతీయ సగటు స్కోరు 28.05గా ఉంటే సగానికి పైగా రాష్ట్రాలు అంతకన్నా చాలా వెనుకబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. రాజస్థాన్ 25.67, గుజరాత్ 22.28, బీహార్ 18.23 స్కోరు మాత్రమే సాధించాయి. పిల్లల పూర్వ ప్రాథమిక విద్య, పునాది స్థాయి అక్షరాస్యత అంశాలను విశ్లేషించింది. పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిలో అక్షర, సంఖ్యా జ్ఞానాలకు సంబంధించి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలెలా ఉన్నాయో ఈ నివేదిక గమనంలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా అంశాల వారీ స్కోరును పొందుపరిచింది.