తెలంగాణలో అధికారం కొల్పోయిన బీఆర్ఎస్ కష్టాల్లో పడింది. ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా తాజాగా నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అయితే పార్టీని వీడిన నేతలతో గులాబీ బాస్ ఇబ్బందులు పడుతుండగా తాజాగా త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కోసం నేతల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది.
కొన్ని స్థానాల్లో సీట్లు తమకంటే తమకేనని కారాలు, మిరియాలు నూరుతున్నారు. ప్రధానంగా నల్గొండ ఎంపీ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థానంలో తన వారసుడు గుత్తా అమిత్ని బరిలో నిలిపేందుకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ నుండి మూడు సార్లు ఎంపీగా గెలిచారు సుఖేందర్ రెడ్డి. ఈ నియోజకవర్గంపై తనకున్న పట్టు నేపథ్యంలో తన తనయుడికే టికెట్ ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు కూడా.
అయితే మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల క్రిష్ణారెడ్డి, ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నుండి తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ నల్గొండ కాకుంటే భువనగిరి స్థానం అయినా ఇవ్వాలని కేసీఆర్ని గుత్తా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. మరి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండలో బీఆర్ఎస్ ఎంపీ టికెట్లు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది.