దసరా పండగ వేళ తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తీవ్రంగా మండిపడగా స్పందించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆర్టీసి టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్ళకు వెళ్లిన ప్రయాణికుల నుండి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం అని ఎక్స్ వేదికగా స్పందించారు.
టికెట్ ధర రూ. 140తో జేబీఎస్ నుండి సిద్దిపేటకు వెళ్లిన ప్రయాణికుడు తిరుగు ప్రయాణంలో టికెట్ ధర రూ. 200 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. హన్మకొండ నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ. 300 ఉంటే, పండుగ వేళ ప్రభుత్వం పెంచిన చార్జీ రూ.420 అన్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టెకెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమే నా ప్రజా పాలన ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు.
ఇక హరీశ్ రావు చేసిన ట్వీట్పై స్పందించారు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఛార్జీల పెంపుపై స్పందించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఛార్జీల పెంపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని…జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు సవరించాం అని తెలిపారు.
ఈ మేరకు లేఖను విడుదల చేసిన సజ్జనార్…రెగ్యులర్ సర్వీస్ ల టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు అన్నారు. స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని చెప్పారు.