ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రజలకే కాదు కీలక రాజకీయ నేతలు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా కొంతమంది నేతలకు ఈ ఎన్నికల్లో గెలుపు వారి రాజకీయ జీవితానికి ఎంతో కీలకం కానుంది. ఒకవేళ ఓడితే రాజకీయాల నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇందులో ప్రధానంగా బీజేపీ నేతలు పురందేశ్వరి, కిరణ్కుమార్, సీఎం రమేష్ , కామినేని, విష్ణుకుమార్, సుజనా వంటి నేతలు ఉన్నారు. బలం లేకపోయినా బీజేపీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. రాజమండ్రి నుండి పురందేశ్వరి,అనకాపల్లి నుండి సీఎం రమేష్, రాజంపేట నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వీరికి గెలుపు తప్పనిసరి. ఎందుకంటే గెలిస్తే రాజకీయాల్లో ముందుకు లేదంటే ఖచ్చితంగా పొలిటికల్ కెరీర్కు సమాధి పడ్డట్లేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిస్తే కేంద్రమంత్రి లేకుంటే పొలిటికల్ కెరీర్కు పుల్ స్టాప్ పడ్డట్లేనని ఆయన అనుచరులే చెబుతున్నారు. పురందేశ్వరి,సీఎం రమేష్లది ఇదే పరిస్థితి.
అసెంబ్లీకి పోటీ చేస్తున్న సుజనా చౌదరి,కామినేని శ్రీనివాస్,విష్ణుకుమార్ రాజులకు కూడా ఈ ఎన్నికలు చావోరేవో తేల్చుకోవాల్సిన సిచ్యువేషన్. మొత్తంగా జూన్ 4తో వీరి భవిష్యత్ ఏంటో తేలిపోనుంది.