టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమకట్టడాల పేరుతో కూల్చివేతలు జోరందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ ఆఫీసులను టార్గెట్ చేస్తూ అధికారులు భవనాలను కూల్చివేస్తుండగా ఇటీవల కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మినగర్లో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝులిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ద్వారంపూడి అనుచరుడు సూరిబాబు అక్రమంగా భవనాలను కడుతున్నారని కూల్చివేత మొదలుపెట్టారు అధికారులు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడకు వచ్చారు. కూల్చివేతలను ప్రశ్నించారు. అదే ద్వారంపూడి చేసిన తప్పు. అధికార పార్టీ అండదండలున్నాయని ఏకంగా కేసు బుక్ చేసేశారు.
అధికారులతో గొడవకు దిగి రెచ్చగొట్టేలా వ్యవహరించడమే కాదు సిబ్బందిపై దాడులకు ప్రయత్నించారంటూ కేసు నమోదుచేశారు పోలీసులు. ఏ-1గా ద్వారంపూడి, ఏ-2గా సూరిబాబులతోపాటు మరో 24 మందిపై కేసు కట్టేశారు పోలీసులు. అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు పనిచేస్తున్నారంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.