సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా కీలకమైన రంగంలో భవిష్యవాణి చెప్పారు మాతంగి స్వర్ణలత. పచ్చికుండపై నిల్చుని భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది చాలా సంతోషంగా ఉన్నానని, మంచి సేవలు అందుకున్నానని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని చెప్పిన స్వర్ణలత, పాడి పంటలకు ఎలాంటి లోటు లేదన్నారు.
భక్తులు తనకు మట్టి బోనాలు తీసుకొచ్చిన, స్వర్ణ బోనాలు తీసుకొచ్చిన సంతోషంగా అందుకుంటానని వారు కోరిన కోరికలు తీర్చుతానని వెల్లడించారు. ప్రజలపై తన దీవెనలు ఉంటాయని ..ఈ ఏడాది ఐదు వారాల పాటు తనకు పప్పు బెల్లంతో సాక పెట్టాలని భక్తును అమ్మవారు కోరారు. ఔషదాలు తగ్గించుకొని పాడి పంటలపై దృష్టిపెడితే అనారోగ్యం అనేది తగ్గుతుందన్నారు.
భక్తులు 48 గంటలు వర్షంలో తడుస్తూ అమ్మ దర్శనం చేసుకున్నారని చెప్పగా.. నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలని వినిపించారు. ఈ ఏడాది పూజలు ఘనంగా అందుకున్నానని చెప్పారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.ఇవాళ సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు జరగనుంది.