ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఎమ్మెల్యేల్లో ఒకరు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో తనదైన మార్క్ చూపించారు కేతిరెడ్డి. ఇక సీఎం జగన్ సైతం కేతిరెడ్డిపై ప్రశంసలు గుప్పించిన సందర్భాలున్నాయి. ఇక ఈ సారి ధర్మవరం నుండి కూటమి తరపున బీజేపీ నుండి సత్యకుమార్ పోటీ చేశారు. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి ఈ సీటును ఆశీంచి నాలుగేళ్లుగా పనిచేస్తూ వచ్చారు పరిటాల శ్రీరామ్. చివరి నిమిషం వరకు టికెట్ తనకేనని భావించినా పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు. ఇక బీజేపీ నుండి వరదాపురం సూరి తీవ్రంగా ప్రయత్నించినా చివరి నిమిషంలో సత్యకుమార్ టికెట్ దక్కించుకున్నారు. టీడీపీ మద్దతుతో సత్యకుమార్ ఎన్నికల ప్రచారం చేశారు.
అయితే కేతిరెడ్డి మాత్రం తనమార్క్ మాటల తూటాలను పేల్చుతూ ముందుకు సాగారు. అయితే బీజేపీ అభ్యర్థి ప్రధానంగా బీసీ కార్డును ఉపయోగించి ప్రచారం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థికి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గం పూర్తి వ్యతిరేకంగా పనిచేసింది. దీనికి తోడు తాను చేసిన అభివృద్ధి, జగన్ సంక్షేమం తనను గట్టెక్కిస్తుందని ధీమాతో ఉన్నారు కేతిరెడ్డి. మొత్తంగా హోరాహోరిగా సాగిన ధర్మవరం పోరులో విజేతగా ఎవరు నిలుస్తారు అనేది జూన్ 4న తేలనుంది.