ఏపీ ఎన్నికల ప్రచారంలో టాప్ గేర్లో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా విస్తృతంగా పర్యటన చేస్తుండగా రేపటి నుండి నాలుగు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఎన్నికల ప్రచారానికి ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉండగా కూటమిలో వర్గపోరు కొనసాగుతోంది. పొత్తులో భాగంగా ఎవరికి వారే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్నిచోట్ల జనసేన ప్రచారానికి రావొద్దంటూ టీడీపీ నేతలు తేల్చి చెబుతుండగా మరికొన్నిచోట్ల టీడీపీ – బీజేపీ కార్యకర్తలకు అస్సలు పొదగడం లేదు.
నంద్యాల జిల్లాలో కోట్ల వర్గం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం మధ్య నువ్వా..నేనా? అన్నట్లు పోరు నడుస్తోండగా ఏకంగా రాళ్ల దాడి చేసుకునేంత వరకు వెళ్లింది పరిస్ధితి. ఇక దెందలూరులో చింతమనేని ప్రభాకర్…జనసేన పేరు చెబితే ఒంటికాలిపై లేస్తున్నారు. ప్రచారానికి రావల్సిన అవసరం లేదని మొహం మీదే చెప్పేస్తున్నారు. ఇక విశాఖ జిల్లా భీమిలిలో ఏకంగా జనసేన నేతల కాలర్ పట్టుకుని ప్రచార రథంపైనుండి టీడీపీ నేతలు దింపేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇవే కాదు మెజార్టీ స్థానాల్లో పేరుకే కూటమి కనిపిస్తుండగా అంతర్గతంగా మాత్రం విభేదాలతో ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కూటమికి డ్యామేజ్ జరగడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.