తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ప్రముఖ నటుడు విశాల్ నామినేషన్ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది. విశాల్ నామినేషన్ ఉదంతంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పత్రాలను తిరస్కరించిన అధికారి వేలుస్వామిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికకు పోటీ చేయడానికి సినీనటుడు విశాల్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ నామినేషన్ లో తప్పులు ఉండడంతో తిరస్కరిస్తున్నామని చెప్పిన రిటర్నింగ్ అధికారి.. విశాల్ ధర్నాకు దిగిన అనంతరం మళ్లీ స్వీకరిస్తున్నామని తెలిపారు. మరికాసేపటికే మళ్లీ తిరస్కరిస్తున్నామని తెలిపి షాకిచ్చిన సంగతి తెలిసిందే.
ఆ అధికారిపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త రిటర్నింగ్ అధికారిగా ఐఏఎస్ ప్రవీణ్ పి.నాయర్ నియమితులయ్యారు. విశాల్ నామినేషన్ పత్రాలను తిరస్కరించిన ఆ అధికారిని ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. కాగా, ఎన్నికల అధికారులు అధికార అన్నాడీఎంకే పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.